రైతు బాంధవులుగా పవన్, చంద్రబాబులు వేషాలు వేస్తున్నారు : సీఎం వైఎస్ జగన్

by Disha Web Desk |
రైతు బాంధవులుగా పవన్, చంద్రబాబులు వేషాలు వేస్తున్నారు : సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘రైతన్నల కష్టాలు చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఏదైతే చెప్పానో అవన్నీ చేశాను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నాలుగేళ్ల పాలనలో రైతుల పక్షాన నిలిచాం అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని కావలిలో శుక్రవారం చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వెళ్లి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పర్యటిస్తున్నారనే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. వీళ్లు వచ్చినా, రాకున్నా ఈ నాలుగేళ్లు ఎవరు కొన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రైతు బాంధవుల వేషాలు వేసుకున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. నాడు ప్రశ్నిస్తామన్న పవన్ కల్యాణ్ నోరెందుకు మెదపలేదని నిలదీశారు. ఇప్పుడేమో రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్ బాబు వైపున నిలబడ్డారని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ధ్వజమెత్తారు.

Also Read.

మహాయజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం వైఎస్ జగన్

Next Story

Most Viewed